1 July, 2026 | 2:49 AM

పనులు వేగవంతం చేయాలి

01-07-2026 01:44 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

చెన్నూర్, జూన్ 30: చెన్నూర్ నియోజక కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం చెన్నూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యలలో భాగంగా చెన్నూర్ మండల కేంద్రంలో చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను సందర్శించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కోరారు.

మున్సిపల్ కమిషనర్ తో కలిసి మునిసిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణం, పైప్ లైన్ల పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 3, 4, 11 వార్డులలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను మండల తహసిల్దార్ మల్లికార్జున్ తో కలిసి పరిశీలించారు.