calender_icon.png 21 February, 2026 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెసిడెన్షియల్ స్కూల్స్, భవిత కేంద్రాల నిర్వహణ మరింతగా మెరుగుపడాలి

21-02-2026 12:39:36 AM

మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష

నిజామాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, భవిత కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా స్పెషల్ ఆఫీసర్లు జరిపిన క్షేత్రస్థాయి సందర్శనలు, ఆయా పాఠశాలల్లో వారు గమనించిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆయా స్కూళ్ళలో నెలకొని ఉన్న స్థితిగతులు, పెండింగ్ పనులు, ఎం.ఎస్.ఓ లు సందర్శించిన దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పరిశీనలు కొనసాగించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎస్‌ఓ లకు ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల నిర్వహణ మరింతగా మెరుగుపడాలని, వివిధ దశలలో నిర్మాణాలలో ఉన్న కేంద్రాల పనులను వేగంగా పూర్తి చేయించాలని సూచించారు.

మంజూరీలు తెలుపబడిన అన్ని పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు గడువు విధించారు. రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం మెనూ ప్రకారం అందుతుందా లేదా అన్నది పరిశీలించాలని, మెనూ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. కలుషిత ఆహారం వంటివి చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కేజీబీవీలు సహా అన్ని బాలికల విద్యాలయాల్లో సీ.సీ టీ.వీలు వర్కింగ్ కండీషన్ లో ఉండాలని, అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, భద్రతకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సమావేశంలో డీఆర్డీఓ సాయాగౌడ్, డీఈఓ అశోక్, ఆర్.సీ.ఓలు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.