19-02-2026 12:23:07 AM
మేళ్లచెరువు, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వేగం గా పనులు పూర్తి చేసి వచ్చే వేసవి నాటికి అందుబాటులో తేవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మేళ్ల చెరువు మై హోమ్ గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణం లో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, దొండపాడు లిఫ్ట్ ఇరిగేషన్, రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్, నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్, ముక్త్యాల బ్రాంచ్ లిఫ్ట్ ఇరిగేషన్, జానపహాడ్ లిఫ్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులన్ని వచ్చే వేసవి నాటికి పూర్తిచేయాలని అవసరమైతే 24 గంటలు పనులు నడిచే విధంగా చూడాలని, ప్రాజెక్టు, సైడ్ కాల్వలకు కావలిసిన భూసేకరణ వేగవంతం చేయాలని, భూసేకరణ పూర్తయిన వాటికి వెంటనే డబ్బులు చెల్లిస్తామని మంత్రి అ న్నారు.
ప్రాజెక్టులపై ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్లు కట్టాలో అక్కడ వెంటనే పనులు ప్రారంభించాలని ఎస్సారెస్పీ ఫేస్ -2 క్రింద ఉన్న ఆయకట్టు, ఎన్ఎస్పీ కిం ద ఉన్న పొలాలకు వారాబంది ప్రకారం నీటి సరఫరా చేయాలని, ఒక ఎకరం కూడ ఎండిపోకూడదని మంత్రి తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో నాగార్జునసాగర్ పోయిన వర్షాకాలం సీజన్లో మూడుసార్లు నిండినదని అలాగే పోయిన వర్షాకాలం సీజన్లో రాష్ట్రంలో అత్యధికంగా వరి పండినదని అలాగే వరికి అత్యధిక మద్దతు ధర చెల్లించి చరిత్ర సృష్టించామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే నరసింహ, ఇరిగేషన్ శాఖ ఎస్సీ, హుజూర్నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మేళ్లచెరువుతో నాకు విడదీయలేని బంధం
మేళ్లచెరువు గ్రామానికి తనకు విడదీయలేని బంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర దేవస్థాన పరిధిలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి ఎద్దుల పందాలు, కబడ్డీ పోటీలను, ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తనకు 1994 నుంచి ఈ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దానికి అనుగుణంగానే మేళ్లచెరువు మండలానికి సాగునీరు, తాగునీరు,విద్యుత్, రోడ్లు,తదితర సౌకర్యాలను వందలాది కోట్ల రూపాయలతో పూర్తి చేశానని అన్నారు.
ప్రతి ఏటా మహాశివరాత్రికి ఉత్సవాలకు వస్తున్నానని అందరూ కలిసికట్టుగా జాతర ఉత్సవాన్ని నిర్వహించుకోవడం హర్షదాయకమని అన్నారు. భవిష్యత్తులో మేళ్లచెరువు శివాలయానికి మరి న్ని నిధులు జోడించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ముందుగా మంత్రి స్వామి వారిని దర్శించుకున్నారు.
మంత్రికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి,వేద పండితులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహు లు,ఐరా రియాలిటీ ఎండీ పో షం నర్సిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ శంబిరెడ్డి, పాలకవర్గ చైర్మన్ లచ్చయ్య, పాలక వర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.