05-02-2026 12:20:11 AM
పెద్దపల్లి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): పెద్దపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసినా తాము గాడిలో పెట్టి, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
పదేళ్ల పరిపాలనలో పట్టణాలను, పల్లెలను గాలికొదిలేసారని, ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని, ఎన్నికలు వస్తె అడ్డగోలుగా మాటలు చెప్పే పార్టీ బీఆర్ఎస్ అని, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించలేదని అన్నారు. జిల్లాలో మున్సిపల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో ఐటీ పార్కును మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణరావు పాల్గొన్నారు.