టెట్ నోటిఫికేషన్ విడుదల
- జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు
- ఏప్రిల్ 15 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలో ఇది తొలివిడత నోటిఫికేషన్ కానుంది. టెట్ నిర్వహణకు సంబంధించి ఇటీవలే పాఠశాల విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రభుత్వం అనుమతించడంతో నోటిఫికేషన్ను విడుదల చేశారు.
ముఖ్యమైన వివరాలు..
* ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
* జూన్ 9 నుంచి టెట్ హాల్ టికెట్ల డౌన్లోడ్
* జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహణ
* జూలై 28 నుంచి 31 మధ్య ఫలితాలు వెల్లడి
* ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండు సెషనల్లలో పరీక్షలు జరుగుతాయి.
* టెట్ పరీక్షకు దరఖాస్తు రుసుం జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక్కో పేపర్ (పేపర్- 1, పేపర్- 2)కి రూ.750 కాగా, రెండు పేపర్లు రాయాలనుకుంటే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే ఒక్కో పేపర్కు రూ.700, రెండు పేపర్లకు అయితే రూ.950 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.




