ప్రణాళిక బద్ధమైన పనితీరుకు ప్రత్యక్ష నిదర్శనం: జిఎం షాలేం రాజు
ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందనున్న షాలేం రాజు
కొత్తగూడెం,(విజయక్రాంతి): బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయమని, ఉద్యోగుల నిరంతర శ్రమ, అంకితభావంతోనే సింగరేణి సంస్థ పురోగతి సాధ్యమవుతోందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు తెలిపారు. ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందనున్న సందర్భంగా కొత్తగూడెం ఏరియా వర్క్షాప్లో, సోమవారం ఆయనకు అధికారులు, గుర్తింపు కార్మిక సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జీఎం షాలెం రాజు మాట్లాడుతూ.. వర్క్షాప్లో పనిచేసే టెక్నీషియన్లు, సూపర్వైజర్లు, అధికారులు రాత్రింబవళ్లు కష్టించి పనిచేయడం వల్లే కొత్తగూడెం ఏరియా బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. సభలో వక్తలు మాట్లాడుతూ.. రామవరం ప్రాంతానికి చెందిన షాలెం రాజు అండర్ మేనేజర్గా ప్రస్థానం ప్రారంభించి, క్రమశిక్షణతో జీఎం స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం ఆయనను శాలువాలు, పూలమాలలతో వైభవంగా సత్కరించారు.






