30 June, 2026 | 9:19 PM

Breaking News

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్

30-06-2026 08:54 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ, ప్రజలకు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ఐదుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 37 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో సేవలందించిన మల్లెంపాటి తిరుమలరావు, పెయ్యాల ప్రసాద్, సాలి పాపయ్య, 36 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన మట్టూరి సత్యనారాయణ, కుప్పా వెంకట విశాల్ కుమార్ పదవీ విరమణ పొందారు. వీరికి  ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ... పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

వ్యాయామం, యోగా, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించాలని సూచించారు. పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య నాయక్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు సుధాకర్, లాల్ బాబు, కృష్ణారావు, పోలీసు అధికారుల సంఘం సభ్యులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.