ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి
- ‘జీరో’ స్టెంత్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ
- 12 మంది నుంచి 120 మందికి పెరిగిన చిన్నబోయినపల్లి పాఠశాల ఆదర్శనీయం
- పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలి
- కలెక్టర్ హేమంత్ సహదేవరావు
ములుగు (మహబూబాబాద్) జూన్ 9 (విజయక్రాంతి): ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10 శాతం విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల సాధించాలని, ‘జీరో’ స్టెంత్ విద్యార్థులున్న పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని,12 మంది విద్యార్థుల నుంచి 120 మంది విద్యార్థులకు పెరిగి న చిన్నబోయినపల్లి పాఠశాల నమోదు ఆదర్శనీయమని, పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.
2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, ఎఫ్ ఎల్ ఎన్ మిషన్, ఎఫ్ ఆర్ ఎస్ హాజరు, బడిబాట కార్యక్రమం నిర్వహణ, పాఠశాలల పునఃప్రారంభ ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ని ప్రతి పాఠశాలలో 10 శాతం మేర విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ బడిబాట కార్యక్ర మాన్ని విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని జీరో స్టెంత్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల నమోదుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మండలాల వారీగా పాఠశాల ల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, కొత్తగా నమోదైన విద్యార్థుల వివరాలు, బడిబాట కార్య క్రమం పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రవేశాల పెంపు కోసం ప్రతి పాఠశాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూ పొందించుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చిన్నబోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 12 మంది నుంచి 120 మందికి పైగా పెంచడంలో విశేష కృషి చేసిన కానిస్టేబుల్ ధూపాటి సతీష్, గ్రామ సర్పంచ్ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించి నమోదు సంఖ్యను గణనీయంగా పెంచడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి కృషి జిల్లాలోని ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.






