పరీక్షా కేంద్రంలో నిబంధనలు తూచ్
ఎలాంటి తనిఖీలు లేకుండానే విద్యార్థుల అనుమతి
పరీక్షల నిర్వహణలో లోపించిన పారదర్శకత
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పరీక్షల నిర్వహణ అంతా మా ఇష్టం.... నిబంధనలతో పనేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొన్ని పరీక్షా కేంద్రాల నిర్వహకులు. రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం విధితమే. దీంతో సెల్ఫ్ సెంటర్ పడిన పరీక్షా కేంద్రాలతో పాటు, ప్రైవేటు పాఠశాలల పరీక్షా కేంద్రాలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించే ముందు విధిగా ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి అనుమతించాలని నిబంధనలను సైతం తుంగలో తొక్కి ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోందని ఆరోపణలు వెలబడుతున్నాయి.
పరీక్ష నిర్వాహకులు కాసులకు కక్కుర్తి పడి పరీక్షలను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. పాల్వంచ పట్టణ పరిధిలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలో 176 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సోమవారం పరీక్షా కేంద్రం లోకి విద్యార్థులు ఎలాంటి తనిఖీలు లేకుండా అనుమతించడం పై ఆరోపణలను ధ్రువపరుస్తోంది. అంతేకాదు పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన విద్యార్థులు బాల్కనీలో తిరగటం గమనార్హం. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. విషయమై జిల్లా విద్యాశాఖ అధికారిని నాగలక్ష్మి ని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ పరీక్షా కేంద్రాలపై దృష్టి సారించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా చూడాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.




