ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి: ఎంఈవో శంకర్
సదాశివపేట: కొత్త విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభమైన సందర్భంగా సదాశివపేట మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. పాఠశాలను కొబ్బరి, మామిడి తోరణాలతో అలంకరించగా, ఉపాధ్యాయులు గులాబీ పూలు, మిఠాయిలతో విద్యార్థులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జొరీగల తులసి సత్యనారాయణ, మండల విద్యాధికారి (ఎంఈవో) శంకర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు అక్షయపాత్ర ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం వడ్డించారు.
కార్యక్రమం అనంతరం సర్పంచ్ తులసి సత్యనారాయణ, ఎంఈవో శంకర్ కలిసి పాఠశాల తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన నిర్వహణ, పాఠశాల ఆవరణను పరిశీలించారు. పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి, గత విద్యా సంవత్సరంలో పాఠశాలను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన ప్రధానోపాధ్యాయులు రామకృష్ణతో పాటు ఉపాధ్యాయులను సర్పంచ్ అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈవో శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






