బాన్సువాడలో మరోసారి వీధి కుక్కల భీభత్సం
ముగ్గురికి తీవ్ర గాయాలు... ఆసుపత్రికి తరలింపు
బాన్సువాడ, ఆగస్టు 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు ఆదివారం మరోసారి దాడి చేసిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో వీధి కుక్కల గుంపు అకస్మాత్తుగా ముగ్గురిపై దాడి చేసింది.
ఈ ఘటనలో సితార అనే మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఖాలీద్ బాబు అనే 6 సంవత్సరాల బాలుడిని, అఫ్రోజ్ అనే 25 సంవత్సరాల వ్యక్తిని కుక్కలు కరిచాయి. దీంతో వారు గాయాలతో బాధపడుతున్నారు.గాయపడిన వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సితారకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.






