నూతన భవనంలో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మార్చి 17 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనంలో వెంటనే విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కొత్త భవనా న్ని సందర్శించి, భవనంలో కొనసాగుతున్న ఫినిషింగ్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా భవనంలోని పలు విభాగాలను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే 10 రోజుల్లోనే మెడికల్ కాలేజీని కొత్త భవనంలోకి షిఫ్ట్ చేసి విద్యార్థులకు తరగతి గదులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్కు ఆదేశించారు. ప్రస్తుతంకళాశాల కొనసాగుతున్న భవనం నుంచి అవసరమైన పరికరాలను త్వరితగతిన కొత్త భవనానికి తరలించాలని సూచించారు.
అలాగే ఆర్ అండ్ బి అధికారులకు భవనంలో ఎటువంటి లీకేజీలు లేకుండా చూసుకోవాలని, ప్రతి గదికి గది నంబర్లతో కళాశాల ఆవరణలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సౌకర్యార్థం తరగతి గదులు మరియు ప్రయోగశాలల్లో అవసరమైన అన్ని పరికరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలోనే ఈ భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించిన స్థలాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
స్కూల్ భవనాల నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించి, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగించాలని ఇంజనీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఆర్ అండ్ బి కార్యనిర్వాహక ఇంజనీర్ దేశ్య నాయక్, ఈ డబ్ల్యూ ఐ డి సి కార్యనిర్వాహక ఇంజనీర్ రామచందర్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.




