శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు
* పూర్ణకుంభంతో అర్చకుల స్వాగతం.. ఆలయంలో ప్రత్యేక పూజలు
అచ్చంపేట: శ్రీశైల ఉత్తర ద్వారంగా బాసిల్లుతున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని బుధవారం దర్శించుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ పరిధిలోని ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని ఉమాసదులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడు మహిషాసుర మర్దిని అయ్యప్ప స్వామి విగ్రహాలకు పూజలు చేశారు.
అమ్మవారికి కుంకుమార్చన అభిషేక పూజలు చేశారు. అర్చకులు వీరయ్య శాస్త్రి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆమె ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రకృతి రమణీయమైన నల్లమల్ల అందాలను వీక్షిస్తూ మధురానుభూతికి లోనయ్యారు. అన్నదాన సేవా కార్యక్రమాన్ని చూసి చైర్మన్ అభినందించారు. ఆలయం వద్ద ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆర్డిఓ యాదగిరి, తహసిల్దార్ సైదులు, డిఎస్పి శ్రీనివాసులు, సిఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






