క్రీడా స్ఫూర్తితో గెలపోటములను స్వీకరించాలి: ప్రాజెక్టు అధికారి రాహుల్
క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
పాల్వంచ, (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. ఆదివారం నాడు కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో చివరి రోజు నిర్వహించిన క్రీడా పోటీల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని అన్నారు. గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని చందనా మాట్లాడుతూ గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించిన సందర్భాలు అరుదని, ప్రస్తుతం ప్రాజెక్ట్ అధికారి చొరవతో వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేశారు.
హోరాహోరీగా సాగిన వాలీబాల్ పోటీలలో ఏకలవ్య విన్నర్స్ గా నిలవగా రన్నర్స్ గా భద్రాచలం జట్టు గెలుపొందింది. అదేవిధంగా షటిల్ , క్యారమ్స్ లో ఏటిడిఓ దమ్మపేట మొదటి స్థానాన్ని, భద్రాచలం రెండో స్థానాన్ని దక్కించుకున్నారని ఆమె అన్నారు.అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏటిడిఓలు ఎస్. చంద్రమోహన్, ఇల్లందు భారతీదేవి, భద్రాచలం రాధమ్మ, కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ హెచ్ఎం ఎన్. చందు, పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు






