25 March, 2026 | 6:32 PM

శ్రీశైలం డ్యామ్ వద్ద తేనెటీగల దాడి.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మృతి

25-03-2026 04:36 PM

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ సమీపంలో తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల(Bees Attack) ఆకస్మిక దాడి కారణంగా ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్ బుధవారం మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. పిల్లి వీరస్వామి (52)గా గుర్తించబడిన బాధితుడు శ్రీశైలం డ్యామ్ వద్ద గస్తీ విధిలో ఉన్న సమయంలో తేనెటీగల ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి.

తేనెటీగల బారి నుండి తప్పించుకునేందుకు పరుగెత్తుతుండగా వీరస్వామి గుండెపోటుకు గురై కుప్పకూలిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. తక్షణమే అతన్ని సున్నిపెంట ప్రాజెక్ట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. అధికారులు ఈ ఘటనను ధృవీకరించి, మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.