18 July, 2026 | 9:01 PM

కేసుల పరిష్కారానికి కృషి జరగాలి

18-07-2026 08:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాల మేరకు క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారం, ముఖ్యంగా అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి కృషి జరగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి పేర్కొన్నారు. శనివారం పోలీస్ శాఖ–న్యాయస్థానాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.

జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీమతి ఎస్. శ్రీవాణి, పెండింగ్ క్రిమినల్ కేసుల పురోగతి, అండర్ ట్రయల్ ఖైదీల కేసుల త్వరిత విచారణ, చార్జ్‌షీట్లను సకాలంలో దాఖలు చేయడం, సాక్షుల హాజరును నిర్ధారించడం, కోర్టు సమన్లు, వారెంట్లను వెంటనే అమలు చేయడం, నాణ్యమైన దర్యాప్తు ద్వారా నేరస్థులకు శిక్షలు పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలను సమర్పించడం వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, మాట్లాడుతూ, ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్, న్యాయస్థానాల మధ్య సమర్థవంతమైన సమన్వయం అత్యంత కీలకమని అన్నారు. ప్రతి దర్యాప్తు అధికారి చట్టపరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, కోర్టు ఆదేశాల అమలులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.