5 August, 2026 | 3:15 AM

ప్రజల్లో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం పెంచాలి

04-08-2026 01:18 PM

రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

రుద్రంగి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు. మంగళవారం రోజున రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ, స్టేషన్ పరిసరాలు, విధుల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలని, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.గ్రామాల్లో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహణను మరింత పటిష్ఠం చేయాలని,అలాగే రౌడీషీటర్లు, గంజాయి, పేకాట, PDS బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలకు, యువతకి గంజాయి వలన కలుగు అనర్ధాలపై,సైబర్ నేరాలపై, రోడ్డు ప్రమాదలపై  విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు, సి.ఐ రవీందర్, ఎస్.ఐ మోతిలాల్, సిబ్బంది ఉన్నారు.