నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని సంతోష్ కిరాణా దుకాణం యజమాని సంతోష్ నిజాయతీని చాటుకుంటూ పోగొట్టుకున్న బంగారాన్ని యజమానికి తిరిగి అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వెంపల్లి గ్రామానికి చెందిన తోట పెద్దరాజరెడ్డి శుక్రవారం మల్లాపూర్లోని సంతోష్ కిరాణా దుకాణానికి వెళ్లిన సందర్భంగా పది గ్రాముల బంగారు ఆభరణాన్ని అనుకోకుండా పోగొట్టుకున్నారు.
దుకాణంలో దానిని గుర్తించిన యజమాని సంతోష్, ఎలాంటి ఆశ లేకుండా వెంటనే పెద్దరాజరెడ్డిని సంప్రదించి బంగారాన్ని సురక్షితంగా తిరిగి అప్పగించారు.వ్యాపారి చూపిన నిజాయతీకి అభినందనగా మల్లాపూర్కు చెందిన సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. సమాజంలో ఇలాంటి నిజాయతీ గల వ్యక్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర అప్రైజర్ ఉపాధ్యక్షులు తిప్పర్తి రామ్ కిషన్తో పాటు పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొని సంతోష్ను అభినందించారు






