ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకం
నిర్మల్,(విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ వీసీ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, అన్ని జిల్లాలలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ, తిరిగి స్వీకరణ, తదితర అంశాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు.
బూత్ లెవెల్ అధికారులకు తప్పనిసరిగా అన్ని అంశాలపై అవగాహన ముఖ్యమన్నారు. జిల్లాల వారిగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు చేపట్టిన చర్యలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాల వివరాలు కలెక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. ప్రక్రియను మొత్తం కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. ఈ వీసీలో భాగంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, ఎస్ ఐ ఆర్ ప్రక్రియను మొత్తం పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ప్రక్రియకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని వివరించారు.






