మరో ఈవీ బస్లో షార్ట్ సర్క్యూట్
- చెలరేగిన మంటలు
- కరీంనగర్ డిపో 2లో ఘటన
కరీంనగర్, జూలై1(విజయక్రాంతి): కరీంనగర్ ఆర్టీసీ డిపో-2 లో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సులో బుధవారంఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. డిపోలో పార్క్ చేసి ఉన్న ఈ బస్సు బ్యాటరీ విభాగంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.
బస్సులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. పక్కనే నిలిపి ఉంచిన ఇతర ఆర్టీసీ బస్సులకు వ్యాపించకుండా సకాలంలో నివారించడంతో భారీ నష్టం తప్పింది.15 రోజుల వ్యవధిలోనే రెండో ప్రమాదం కరీంనగర్ పరిధిలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మొదటి ప్రమాదం జూన్ 21న కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ అద్దె ఎలక్ట్రిక్ బస్సులో తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారులో ప్రయాణికులతో వెళ్తుండగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయ స్పూర్తితో ప్రయనికు లు సురక్షితంగా బయటపడ్డారు. రెండు వారాల్లో రెండు అగ్ని ప్రమాదాలు జరగడం తో ఈవీ బస్సులు ఎక్కలంటే ప్రయాణికులు భయపదుతున్నారు.






