విద్యార్థినుల భద్రతకు అండగా షీ టీమ్
* ఇష్టం లేని విషయాలకు ధైర్యంగా "నో" చెప్పడం నేర్చుకోవాలి
* డీసీపీ ఏ. భాస్కర్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మహిళలు, విద్యార్థినుల భద్రత, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని పరిరక్షించడమే షీ టీమ్ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ ఆర్. ప్రకాష్తో కలిసి డీసీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలు, ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ప్రత్యక్షంగా ఎలాంటి వేధింపులు ఎదురైనా సహించకుండా వెంటనే షీ టీమ్ను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. "పోనీలే" అని మౌనంగా ఉంటే వేధింపులు మరింత పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ భరించవద్దన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లాలన్నా, కేసు నమోదు చేయాలన్నా భయాందోళనలు, అపోహలు విడనాడాలని కోరారు.
విద్యార్థినులు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే అవసరమైనప్పుడు ధైర్యంగా "నో" (No) చెప్పడం నేర్చుకోవాలని డీసీపీ సూచించారు. ఇతరులను చూసి కాకుండా, తమ ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి చదువు, వృత్తులను ఎంచుకోవాలన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడకుండా, ప్రశాంతంగా విశ్లేషించి, సరైన ప్రణాళికతో అధిగమించాలని పిలుపునిచ్చారు.






