14 August, 2026 | 3:13 PM

అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్‌

14-08-2026 01:54 PM

గణపురం,ఆగస్టు 14 విజయక్రాంతి: గణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు ఐదు క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని నేర పరిశోధన విభాగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు నేర పరిశోధన విభాగం పోలీసులు తనిఖీలు చేపట్టగా, రవినగర్‌కు చెందిన తుర్పాటి రాజశేఖర్‌  అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీంతో అతని వద్ద ఉన్న సుమారు ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు తుర్పాటి రాజశేఖర్‌తో పాటు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం గణపురం పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.