తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్
సత్తుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ జి. చంద్రమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ఉద్యమం ప్రజల ఆకాంక్షల ఫలితమని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్లు వి. బ్రహ్మచారి, ఎన్. చంద్రకళ, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్లు తిరుమలరావు, శిరోమణి, క్షేత్రస్థాయి సిబ్బంది, అటవీ కార్మికులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత పచ్చదనంతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వేడుకలు ముగిశాయి.






