బాలకార్మికుడికి విముక్తి… బడిలో చేర్పించిన సర్పంచ్
హన్వాడ: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి గౌతమ్ కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేసి, హన్వాడ మండల కేంద్రంలోని ఓ టీ దుకాణంలో బాలకార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆ బాలుడిని గుర్తించి స్టేట్ హోంకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దదర్పల్లి గ్రామ సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్ వెంటనే చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో మాట్లాడి, విద్యార్థి గౌతమ్తో పాటు అతని తల్లికి విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
అనంతరం సోమవారం హన్వాడ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గౌతమ్ను 10వ తరగతిలో చేర్పించడంతో పాటు హాస్టల్లో కూడా ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దీప్తిరఘురాం గౌడ్ను జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి లను హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రఘురాం గౌడ్, ఉప సర్పంచ్ భరత్ యాదవ్, రఘునందన్ యాదవ్, మున్నూరు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.






