పరిశోధన ఆధారిత నవలలు రావాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కొండమల్లు నవల కొత్త ఎడిషన్ అందుకున్న మాజీ మంత్రి
హైదరాబాద్, మే14 (విజయక్రాంతి) : చారిత్రక, సామాజిక అంశాలను కొత్త దృష్టితో స్పృశించే నవలలు, ఆవిష్కరణలు మరిన్ని రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. చెంచుల జీవనం, సంస్కృతిని ప్రతిబింబించేలా నవలను రాయటం అభినందనీయమన్నారు.
గురువారం నందినగర్లోని తన నివాసంలో ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, కొణతం దిలీప్, జర్నలిస్టు సంఘం నాయకుడు ఆస్కాని మారుతిసాగర్, జర్నలిస్టు తిరుపతి నాయక్ తదితరులు కలిసి రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు ’కొండమల్లు’ నవల నూతన ఎడిషన్ను కేటీఆర్కు అందజేశారు. తమ రాజధానిని విస్తరించుకునే ప్రయత్నంలో బ్రహ్మనాయుడి సైన్యం చెంచు నివాసాలపై దాడి చేయడాన్ని ఎదురించే ఈ కథ, చెంచు నాయకుడైన బయ్యన్న చుట్టూ తిరుగుతుందన్నారు.
800 ఏళ్ల నాటి పల్నా టి సీమ చరిత్ర, చెంచుల సామాజిక అంశాలపై జరిపిన పరిశోధన ఆధారంగా నూతన దృక్కోణంతో రచించిన నవల ఇతివృం తంపై ప్రజాకవి గోరటి వెంకన్న కేటీఆర్కు వివరించారు. తెలంగాణలోని నల్గొండ, నాగర్కర్నూల్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవి, చెంచుల జీవి తం, సంస్కృతి గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నేపథ్యం ఉన్న చా రిత్రక అంశాలపై పరిశోధించి నవల రాయాలని కేటీఆర్ వారికి సూచించారు.






