22 April, 2026 | 6:54 AM

పేకాట స్థావరంపై దాడి.. 17 మందిపై కేసు

22-04-2026 12:55 AM

కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 21(విజయక్రాంతి): నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న జూద కార్యకలాపాలపై పోలీసులు కఠినంగా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, సోమవారం రాత్రి జరిగిన ఘటన సంచలనం రేపింది. III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో ఒక ఇంటిని అడ్డాగా మార్చుకుని నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సబ్ ఇన్స్పెక్టర్ బి. చెరాలు బృందం, ఉన్నతాధికారుల అనుమతితో సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటిపై దాడి నిర్వహించగా, అక్కడ రెండు టేబుళ్లపై మూడు కార్డులతో డబ్బులు పెట్టి జూదం ఆడుతున్నట్లు గుర్తించారు.

ఈ సందర్భంగా మొత్తం రూ. 6,74,280 నగదు, 16 మొబైల్ ఫోన్లు, 104 ప్లేయింగ్ కార్డులు, 2 బైకులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో ఒక ప్రధాన నిందితుడు ఈ జూదాన్ని నిర్వహిస్తూ కామన్ గేమింగ్ హౌస్ నడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనంతరం ఏ1 నుంచి ఏ17 వరకు నిందితులందరిని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇటీవలి కాలంలో పోలీసులు లాడ్జీలు, హోటళ్లలో జరుగుతున్న జూదంపై కఠిన చర్యలు తీసుకోవడంతో నిర్వాహకులు తమ వ్యూహాలను మార్చినట్లు సమాచారం.