కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, రుచి, మెనూపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యాబోధన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన ఎమ్మెల్యే, విద్యే భవిష్యత్తుకు ప్రధాన పునాది అని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీపై విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.






