ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి
కొత్తగూడెం,(విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం సాధన కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షురాలిగా పొన్నెకంటి జయకుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్లో కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంటి ముదిరాజ్, సూర స్రవంతి మాట్లాడుతూ, జిల్లాలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భవిష్యత్తులో రాష్ట్ర సమాచార కమిషనర్లతో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, చట్టం ద్వారా లభించే హక్కులు, ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కమిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నెకంటి సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు.






