11 June, 2026 | 3:23 AM

వర్షాకాలం వరదలు రాకుండా ముందస్తు చర్యలు

11-06-2026 02:29 AM

కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ జూన్ 10 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో వర్షాకాలం భారీ వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలువ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో గతంలో వర్షాలు కురిసి నీటిమయమైన శివాజీ చౌక్ మంచిర్యాల చౌరస్తా, విశ్వనాథ్ పేట్, సిద్దాపూర్ వాగు ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వర్షాకాలంలో పట్టణంలో ఎక్కడ కూడా రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండరాదని పేర్కొన్నారు.

వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు వర్షాకాలం పూర్తయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పట్టణ ప్రజలకు వరద నీటి వల్ల ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. డ్రైనేజీలు, నాళాలు పరిశీలించారు. ఎప్పటికప్పుడు పూడికలు తీసివేస్తూ నీటి ప్రవాహానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, తహసిల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.