ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి..
ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు...
ఉట్నూర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
గుడిహత్నూర్ మండలం తోయగూడ గ్రామానికి చెందిన పెందోర్ వినాయక్ తనకి బోర్ వెల్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. మంచిర్యాల మండలం పెద్ద గోపాలపూర్ గ్రామానికి చెందిన హనామంతు తనకు ఆశ్రమ పాఠశాలలో వాచ్ మెన్ ఉద్యోగం ఇపించమని కోరారు.
కేరెమెరి మండలం కేరెమెరి గ్రామానికి చెందిన ఆడే భూదేవి తనకి పై చదువు ల కొరకు ఆర్థిక సహాయం కల్పించామని విజ్ఞప్తి చేశారు.ఉట్నూర్ మండలం ఉట్నూర్ గ్రామానికి చెందిన నీలాబాయ్ తనకి పట్టా ఇపించమని దరఖాస్తు అందజేశారు.
అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.
ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






