ప్రజావాణి దరఖాస్తులు క్షేత్ర స్థాయిలో పరిష్కరించాలి
ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు..
ఉట్నూర్, జులై 27(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం చిత్రు తనకు పట్టా ఇపించమని కోరారు. ఆసిఫాబాద్ మండలం మాణిక్ గూడ గ్రామానికి చెందిన భీము తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కల్పించామని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు. ఆయనతోపాటు ఏపీ ఓ జనరల్ వసంతరావు జాదవ్, ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






