నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
6న తొలి విడత సీట్ల కేటాయింపు
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం తొలివిడత కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఈనెల 27 నుంచి 31 వరకు అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 29 నుంచి జూన్ 1 వరకు హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు ఈనెల 29 నుంచి జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 6న లేదా అంతకంటే ముందే సీట్లను విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ ఏడాది మొత్తం 111 పాలిటెక్నిక్ కాలేజీల్లో 33,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో 59 ప్రభుత్వ కాలేజీల్లో 18,788 సీట్లు ఉండగా, 52 ప్రైవేట్ కాలేజీల్లో 14,352 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో అత్యధికంగా 6,490 సీట్లు, ఈఈఈలో 5,385, ఈసీఈలో 5,305, మెకానికల్ ఇంజినీరింగ్లో 3,480, సివిల్ ఇంజినీరింగ్లో 3,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి.






