బెల్లంపల్లి బస్తీలో పోలీసుల కార్డెన్ సెర్చ్
- తెల్లవారుజామున చుట్టుముట్టిన పోలీసులు
- ఇళ్లలోకి ప్రవేశించి నిర్భంద సోదాలు
- 50 వెహికల్స్,6 ఆటోలు సీజ్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బస్తీలో పోలీసుల కార్డెన్ సెర్చ్ కలకలం రేపింది. తెల్లవారు జామున బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసు బలగాలు ఆకస్మికంగా బస్తీ నీ చుట్టుముట్టారు. పోలీసులు ఇళ్లలోకి ప్రవేశించి సోదాలు చేశారు. ఆకస్మికంగా పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులను చూసినా బస్తీ వాసులు ఒక్కసారిగా వణికిపోయారు. ఏమి జరుగుతుందో తెలియక ఆందోళన పడ్డారు. అనుమానితులు ఎవరైనా ఉన్నారని వాకబు చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.
తలుపులు కొట్టి నిద్రలో ఉన్న ప్రజలను లేపి ఇళ్లలో నిర్భంద సోదాలు చేశారు. పోలీసుల హడావిడి చూసిన ప్రజలు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఇళ్లలోని వెహికల్స్, ఆటోలను బయట పెట్టించారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్రావు, పెద్ద ఎత్తున పోలీసులు తెల్లవారుజామున ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’తో బస్తీలోకి ప్రవేశించారు. అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు, సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు,06 ఆటోలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా బస్తీ వాసులతో సమావేశం నిర్వహించి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ నేర నిర్మూలన సాధ్యమన్నారు. బస్తీలో అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వారు ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలనీల స్వీయరక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. కార్డెన్ సెర్చ్ లో 20 మంది పోలీస్ అధికారులు, పెద్దఎత్తున పోలీసులు పాల్గొన్నారు.






