అక్రిడిటేషన్ దరఖాస్తుల్లో సవరణకు అవకాశం ఇవ్వాలి
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నిర్మల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంకగారి భూమయ్య బుధవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే సమయంలో జర్నలిస్టులు తమ పేర్లు, ఇతర వివరాలను నమోదు చేయడంలో లేదా పత్రాలను అప్లోడ్ చేయడంలో కొన్ని చిన్నపాటి పొరపాట్లు దొర్లుతున్నాయని, అయితే ఒకసారి దరఖాస్తును 'సబ్మిట్' చేసిన తర్వాత వాటిని సరిదిద్దుకోవడానికి పోర్టల్లో ఎటువంటి 'ఎడిట్' ఆప్షన్ లేకపోవడం జర్నలిస్టులకు ఇబ్బందిగా మారిందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
కేవలం చిన్నపాటి క్లరికల్ తప్పుల వల్ల అర్హులైన జర్నలిస్టుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వందలాది మంది జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వారు వివరించారు. ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి, పోర్టల్లో దరఖాస్తులను ఎడిట్ లేదా రివ్యూ చేసుకునే సదుపాయాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తద్వారా అర్హులైన జర్నలిస్టులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్రిడిటేషన్ ప్రక్రియ పూర్తవుతుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ యూనిట్ సభ్యులు మరియు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.




