20 March, 2026 | 6:42 AM

సుఖశాంతులు అందించి అభయాన్ని కలిగించాలి

20-03-2026 12:00 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, మార్చి 19 (విజయ క్రాంతి) : శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ సుఖశాంతులు అందించి అభయాన్ని కలిగించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా మహబూబ్ నగర్ నగరంలోని శిల్పారామం ప్రాంగణంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పంచాంగ కర్త శ్రీ శ్రవణ్ కుమార్ సంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణం నిర్వహించి, నూతన సంవత్సర ఫలితాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహబూబ్ నగర్ ప్రజలు సుఖసంతోషాలతో, ప్రశాంతంగా జీవించాలని, సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కోరారు. రైతులు సమృద్ధిగా పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, వారి కష్టానికి తగిన ఫలితాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. మహబూబ్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో ముందంజలో నిలవాలని, నగర కీర్తి నలుదిశలా వ్యాపించాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, నగర కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.