04-02-2026 12:00:00 AM
టాలీవుడ్లో శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ముకుందన్.. ఇప్పటికే పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. అటు బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా రూపొందుతున్న ఒక సినిమాలో హీరోయిన్గా ప్రీతి ముకుందన్ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ఈ చెన్నై చందమామ తెలుగులో మరో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక ఇటీవల ‘ఛాంపియన్’ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ యంగ్ హీరోకు ప్రస్తుతం అవకాశాలు వరుస కడుతున్నాయి.
ఇందులో భాగంగా ఆయన డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ లవ్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. మార్చి నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్గా ఓ క్రేజీ బ్యూటీని మేకర్స్ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ‘కన్నప్ప’ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న చెన్నై చిన్నది ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుందట.