సమయపాలన పాటించని అధికారులకు శాఖ పరమైన చర్యలు తప్పవు
నాగర్కర్నూల్,(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో అధికారులు ఎవరు సమయానికి రాకపోగా అధికారుల కోసం ప్రజలు ఎదురు చూడటాన్ని కలెక్టర్ అధికారుల అలసత్వంపై ఆగ్రహానికి లోనయ్యారు. సమయానికి విధులకు హాజరు కాని అధికారులు, సిబ్బందిపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆలస్యంగా వచ్చిన అధికారులకు షోకాస్ నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారుల ఆదేశించారు. ప్రజలకు సేవలు అందించే బాధ్యతతో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించిన ఆయన, నిర్లక్ష్యం, ఆలస్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండదన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా వేగవంతంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.






