జూనియర్ కాలేజీల్లో కొత్తగా మధ్యాహ్న భోజనం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly session ) కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో(Junior Colleges) ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజనం పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విద్యార్థుల సంక్షేమం కోసం తాము చేపడుతున్న చర్యలలో నూతన అధ్యాయానికి నాంది అన్నారు.
2026-27 విద్యా సంవత్సరం నుండి, ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్(Pre-Primary to Intermediate) వరకు చదువుతున్న విద్యార్థుల కోసం, నాణ్యమైన పోషకాహారంతో కూడిన అల్పాహార పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అల్పాహార కార్యక్రమం కింద, ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి జావ అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమం పోషకాహార, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణలో ఏ బిడ్డ కూడా ఖాళీ కడుపుతో పాఠశాల రోజును ప్రారంభించకూడదని తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి ఇది ఒక చారిత్రాత్మక సంస్కరణ అన్నారు. ఈ అల్పాహార పథకం కేవలం శరీరాలకు పోషణనే కాకుండా, తెలంగాణ భవిష్యత్తుకు కూడా పోషణను అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.




