తెలంగాణలో మరో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా
హైదరాబాద్: తెలంగాణలో జన్మించడం, ఇక్కడే జీవించడం ఒక వరంగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందకు తగిన సౌకర్యాలను కల్పిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం భద్రతను కల్పిస్తోందన్నారు. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే, ఆ కుటుంబం అనుభవించే మానసిక వేదన ఒక ఎత్తు కాగా, వారు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొక ఎత్తు అన్నారు.
కేవలం ఒక్క సంఘటన ఆ కుటుంబాన్ని వీధుల పాలు చేయగలదని పేర్కొన్నారు. తెలంగాణలోని ఏ ఒక్క బిడ్డ కూడా అటువంటి భయం, అభద్రతా భావంతో జీవించకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. "ఈ బడ్జెట్లో ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశంలోనూ సాధ్యం కాని రీతిలో, అపూర్వమైన స్వభావం కలిగిన ఒక గొప్ప జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది," అని విక్రమార్క పేర్కొన్నారు. సామాజిక విభేదాలతో నిమిత్తం లేకుండా, పేద, మధ్యతరగతి లేదా ధనిక అనే వివక్ష లేకుండా, రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమాను అందించే ఉద్దేశంతో, ప్రభుత్వం జూన్ 2, 2026 నుండి సరికొత్తగా “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం”ను ప్రవేశపెడుతోందని ప్రకటించారు.




