27 May, 2026 | 2:24 AM

కేంద్రంలో నిర్లక్ష్యం.. ఇక్కడ యాత్రలా?

27-05-2026 01:07 AM
  1. ఏ రాష్ట్రంలో ఎంత ధాన్యం బీజేపీ చెప్పాలి
  2. రాష్ట్రంలో చివరి గింజ వరకు కొంటాం
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనకుండా నిర్లక్ష్యం చేస్తుంటే.. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు ఇక్కడ యాత్రలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఎంత ధాన్యం కొన్నారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించడం లేదని విమర్శించారు.

కేంద్రం చెప్పిన మద్దతు  ధర పెట్టి ధాన్యం తీసుకోవాలన్నారు. కేంద్రంలో నిర్లక్ష్యంగా ఉండి, ఇక్కడ బీజేపీ యాత్రలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ ధాన్యం తెలంగాణ కొనుగోళ్లు చేస్తోందని, తాము 70 లక్షల టన్నులు కొంటున్నామన్నారు. ఈ ధాన్యం మొత్తం కేంద్రం కొనాల్సిందన్నారు. రాష్ట్రంలో చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. గత ఏడాది, ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంకంటే 5వేల కోట్లు ఎక్కువ ఖర్చు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారో చెక్ చేసుకోని తమపై విమర్శలు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.