ఫరూక్ అబ్దుల్లాపై దాడి.. జమ్మూలో నిరసనలు
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) గురువారం జమ్మూలో నిరసన ప్రదర్శన చేపట్టింది. తమ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై(Farooq Abdullah) జరిగిన దాడిని నిరసిస్తూ, ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి శాంతిభద్రతలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి జమ్మూ శివార్లలోని గ్రేటర్ కైలాష్లో జరిగిన వివాహ కార్యక్రమం నుండి బయటకు వెళుతుండగా వెనుక నుండి ఒక దుండగుడు కాల్పులు జరపడంతో అబ్దుల్లా (88) తృటిలో తప్పించుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పురాని మండి నివాసి అయిన 63 ఏళ్ల కమల్ సింగ్ జామ్వాల్, గత 20 సంవత్సరాలుగా అబ్దుల్లాను లక్ష్యంగా చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని దర్యాప్తు అధికారులకు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.
తనపై జరిగిన హత్యాయత్నం గురించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ, "అతని ఉద్దేశ్యం ఏమిటో లేదా అతనికి ఎలాంటి పగ ఉందో నాకు తెలియదు. నేను ఎవరికీ ఏ తప్పు చేయలేదు. నేను పదవిలో ఉన్నప్పుడు, ప్రతిపక్షం నుండి లేదా మరెక్కడైనా నా వద్దకు ఎవరు వచ్చినా, నేను వారికి మరింత ప్రేమను చూపించడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాను. నా హృదయంలో ఎవరిపైనా ద్వేషం ఎప్పుడూ లేదు. అతనికి ఏ సమస్య ఉందో లేదా అతను ఏ బాధను మోస్తున్నాడో నాకు తెలియదు" అని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.




