3 July, 2026 | 7:09 PM

జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది

03-07-2026 06:14 PM

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు జడల సురేందర్

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లాలో నిరుపేద మున్నూరు కాపు కుటుంబాలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని మున్నూరు కాపు సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జడల సురేందర్ అన్నారు. గత నెలలో కురిసిన అకాల వర్షాలతో జిల్లాలోని అందుగులపల్లి గ్రామానికి చెందిన కామ వెంకన్న, సుగుణ దంపతుల ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో మున్నూరు కాపు సంఘం తక్షణమే స్పందించింది. జిల్లా అధ్యక్షుడు జడల సురేందర్ ఆధ్వర్యంలో సంఘం సభ్యుల నుంచి సుమారు రూ.35 వేల విలువైన సహాయాన్ని సేకరించి, బాధితులకు ఇంటి మరమ్మతుల కోసం రేకులు అందించడంతో పాటు రూ.6 వేల నగదును అందజేశారు.

ఈ సందర్భంగా జడల సురేందర్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుల బాంధవులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అర్హులైన నిరుపేద కుటుంబాలకు సంఘం తరఫున మరింత విస్తృతంగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్. రాజయ్య మాట్లాడుతూ... సంఘం సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.

గ్రామ, మండల శాఖల ద్వారా సమాచారం అందించిన అర్హులైన నిరుపేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలు, విద్యార్థుల విద్యాభ్యాసం, ప్రకృతి విపత్తులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి స్థానిక సంఘాల ద్వారా ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు.