మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి
- జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, చైర్ పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరిలతో కలిసి బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధికి బడ్జెట్ ప్రణాళికలు సమర్థవంతంగా రూపొందించి అమలు చేయాలని తెలిపారు.
వివిధ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించి, 2025-26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్, 2026-27 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ లను కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో ప్రతిపాదిత మున్సిపల్ బడ్జెట్ను ఖరారు చేశారు. 2026-27 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ రూ.25 కోట్ల 80 లక్షల అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారని, ఇందులో రూ.3 కోట్ల 42 లక్షలు సాధారణ ఆదాయం ( గ్రాంట్లు కాకుండా), 21 కోట్ల 42 లక్షల రూపాయల గ్రాంట్లు, రూ.90 లక్షల డిపాజిట్లు, అడ్వాన్సులు, 5 లక్షల 95 వేల రూపాయల నిలువ ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ పరిధిలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. అనంతరం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని డంప్ యార్డ్లో చేపడుతున్న బయో మైనింగ్ పనులను పరిశీలించారు. పాత చెత్తను శాస్త్రీయ పద్ధతులలో వేరు చేసి, పర్యావరణానికి హాని లేకుండా నిర్వహిస్తున్న విధానం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బయో మైనింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




