మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు
వేములవాడ,(విజయక్రాంతి): మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలు, పాదచారులు, పట్టణ వాసులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. వేసవి కాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






