పట్వారిగూడెంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని పట్వారిగూడెంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామి రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.
పట్వారిగూడెంలో నూతన పంచాయతీ భవన నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు పాలనా సేవలు మరింత వేగవంతంగా మరియు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, పట్వారిగూడెం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






