పెద్దగొల్లగూడెం బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ
విద్యార్థుల భోజనంలో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం
మధ్యాహ్నపు చారే సాయంత్రం వడ్డిస్తారా?.. మెనూ ఉల్లంఘనపై సీరియస్
అపరిశుభ్ర స్టాక్ రూమ్లను పరిశీలించి అధికారులపై మండిపడిన ఏం ఎల్ ఏ జారే
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్ భవన సముదాయాన్ని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి కూడా పాల్గొని విద్యార్థుల వసతి, భోజన సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నేరుగా వంటశాల వద్దకు వెళ్లి, వండి ఉన్న అన్నం, చిక్కుడుకాయ కూర, చారును స్వయంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సాయంత్రం వేళ సాంబారు, కోడిగుడ్లు అందించాల్సి ఉండగా, మధ్యాహ్నం వండి మిగిలిన చారునే సాయంత్రం కూడా పిల్లలకు వడ్డిస్తుండడంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్ రూమ్ను పరిశీలించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కూరగాయలు మరియు పండ్లు తీవ్ర అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచడాన్ని గమనించి బాధ్యురాలైన వార్డెన్పై మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని, తమ సొంత పిల్లల్లా భావించి జాగ్రత్తగా చూసుకోవాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్య వైఖరి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హెచ్చరించారు.






