24 April, 2026 | 9:32 PM

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి: ఎంపీ డా.మల్లు రవి

24-04-2026 08:29 PM

నాగర్‌ కర్నూల్(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలవుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాగర్‌ కర్నూల్ ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ (దిశా) కమిటీ చైర్మన్ డా.మల్లు రవి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశా సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ఉపాధి సృష్టిలో బ్యాంకుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. పీఎంఈజీపీ, ముద్ర యోజన, పీఎం విశ్వకర్మ వంటి పథకాల కింద అర్హులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఇప్పటికే ఆమోదం పొందిన రుణాలు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, రోడ్లు, అంగన్వాడి కేంద్రాలు, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి పనులపై సమీక్షిస్తూ నిర్ణీత గడువుల్లో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్య, సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల పనితీరుపై కూడా సమీక్ష నిర్వహించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.