అరెస్టుతో ఉద్యమాలు ఆగవు
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం చేతగాకనే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజును అక్రమ అరెస్టు చేయడం జరిగిందని జేఏసీ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న ముదిరాజ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం కోసం పోరాటం చేయడానికి జగిత్యాల జిల్లా నూక పల్లి అర్బన్ కాలనీలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా వెళ్లిన డాక్టర్ విశారదన్ మహారాజ్ ను అరెస్ట్ చేయడం అప్రాజస్వామికమన్నారు.
90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ప్రస్తుతం తెలంగాణలో ఒకే ఒక్క గొంతుకగా ఉన్న విశారదన్ మహారాజును కక్షగట్టి ఇలాంటి అరెస్టులకు పాల్పడుతున్నారని, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం పై నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, లీగల్ సెల్ అడ్వైజర్ అడ్వకేట్ గొడుగు గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరు సుధాకర్, నాయకులు స్వామి పాల్గొన్నారు.






