రాజకీయం అంటే పెత్తనం కాదు.. బాధ్యత
పేదోడి కడుపునింపిన మహా నేత రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : రాజకీయం అంటే పెత్తనం కాదు బాధ్యత అని ఆ బాధ్యత ను సమర్ధవంతంగా తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవా చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీవర్ధంతి సందర్భంగా అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద వారి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం మొత్తం కన్నీరు పెట్టించిన ఆ దురదినం మన దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు అన్నారు. రాజీవ్ గాంధీ యువ ప్రధానిగా దేశానికి కొత్త దిశ చూపించారని, ఆయన కళ్ళలో ప్రేమ, మాటల్లో మృదుత్వం, వ్యక్తిత్వంలో హుందాతనం స్పష్టంగా కనిపించేవన్నారు.
తల్లి ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశం కష్టాల్లో ఉన్న సమయంలో బాధను జీర్ణించుకుని ప్రజలను ఏకం చేసి దేశ పునర్నిర్మాణానికి ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన పాలనలో దేశ ఐక్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి చర్చలు జరిపి, ప్రజలకు గౌరవం కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. దేశాభివృద్ధికి పునాది వేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలపరిచి, స్థానిక సంస్థలకు అధికారాల వికేంద్రీకరణ, కంప్యూటర్, సాంకేతిక రంగాలకు ప్రోత్సాహం వంటివి అన్నీ ఆయన దూరదృష్టిని ప్రతిబింబిస్తాయని ఆయన చెప్పారు. భారతదేశంలో కంప్యూటర్ యుగానికి నాంది పలికిన నాయకుడు కూడా ఆయనే అని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న స్థాయికి రావడానికి ఆయన వేసిన బాట ఎంతో కీలకం అని ఆయన చెప్పారు.
దురదృష్టవశాత్తు ఉగ్రవాద దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని. ఆయన మరణం దేశానికి తీరని నష్టం అని, అయినా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం మే 21ను ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తూ, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ, భౌతికంగా మనతో లేకపోయినా, ఆయన చూపిన మార్గం, ఆశయాలు మనకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని. ఆయన కలల భారతదేశ నిర్మాణానికి మనం అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, ఎస్సీ సెల్ చైర్మన్ సాయిబాబా, సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, కార్పొరేటర్లు రమేష్ రెడ్డి, పెద్ద గొల్ల నర్సింహులు, గులాం జహీర్, రమేష్ బాబు, ప్రశాంత్ , నాయకులు బి.మోహన్ బాబు, రియాజ్, అంజద్, గోవింద్ యాదవ్, తెలుగు గూడెం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






