అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన ఎమ్మెల్యే జారే
మల్లారం ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యా నాణ్యతను పరిశీలించి
దమ్మపేట,(విజయ క్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని మల్లారం గ్రామంలో 'నేను సైతం చేయూత' కార్యక్రమంలో భాగంగా విద్యా యాత్ర -మన ఎంఎల్ఎ - మన బడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేజారే మల్లారం గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా విధానాన్ని, అభ్యసన నైపుణ్యాలను, విద్యా నాణ్యతను నిశితంగా పరిశీలించారు. అనంతరం విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు.
పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన, విద్యార్థుల భద్రత దృష్ట్యా తక్షణమే ప్రహరీ గోడ నిర్మాణాన్ని శాంక్షన్ చేయడంతో పాటు పాఠశాల భవన అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక గ్రాంట్ కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






